అందరికీ నమస్కారం
ఈ ' వినయ్ ' అనే వినయ దత్త మా బాబే !
ఈరోజుకి అతడు పుట్టి సరిగ్గా పదకొండేళ్లయింది.
తిథుల ప్రకారం ( 2000 వ సంవత్సరం ) ఆదివారం - అమావాస్య - అర్థరాత్రి పుట్టడం వల్లనేమో కొంత విలక్షణంగా వుంటాడు. ఎప్పుడూ ఉత్సాహంగా వుంటాడు.
ఒక సంవత్సరం కాలం నుంచి నేను ' కూడలి ' ని తరచుగా సందర్శిస్తున్నాను. ఇది గమనించిన వినయదత్తా ' ఎప్పుడూ కూడలేనా ? ఎప్పుడూ తెలుగు బ్లాగులేనా ? ' అనేవాడు. అప్పుడు నేను ' కథామంజరి ' తదితర బ్లాగుల్లోని కథలు చదివి వినిపించాను.
' శిరాకదంబం ' లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టపా ద్వారా ఆ గాన గంధర్వుడికి శుభాకాంక్షలు అందిస్తూ మా బాబు పేరును కూడా చేర్చాను. బాలు తాతగారంటే వాడికీ ఇష్టమే మరి. మా శుభాకాంక్షలకి స్పందించిన రావుగారు ప్రత్యేకంగా రెండు మాటలు మా బాబుని ఉద్దేశించి రాశారు. అప్పటికే కథలకి ఆకర్షితుడయ్యాడు కాబట్టి ' అమ్మా ! నేను కూడా బ్లాగు రాస్తాను ' అన్నాడు. అడిగిందే తడవుగా ప్రయత్నించినా ఎందుకో మరి మొదలు పెట్టడానికే కొంత ఆలస్యమైంది. మొత్తానికి అతడి ఆలోచనకి, ఊహకి ఒక రూపం ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా వుంది.
తెలుగు చదవడం, రాయడం రాకపోయినా అతని టపాలోని మాటలు అతనివే ! పదాలు మాత్రమే నావి. ఎప్పుడో ఒకసారి మీ ముందుకు వచ్చే వినయ దత్త ను ఆశీర్వదించగలరు. ఇదే వేదికను ఉపయోగించుకుని నేనూ కొన్ని టపాలు ప్రచురించగలను.
శుభాభినందనలతో............
మాధురి
ప్రాణిక్ హీలర్
కాంట్రిబ్యూటర్, ఈనాడు
చెన్నై